

భారత్ ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థను రూపొందించే సామర్థ్యం కలిగిన దేశమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో మాట్లాడిన ఆయన, అసాధారణ కంపెనీల ఏర్పాటుకు దేశంలోని పారిశ్రామిక, సాంకేతిక వ్యవస్థలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని తెలిపారు. ఫ్లిప్కార్ట్, ఓయో వంటి స్టార్టప్ల విజయాలు భారత్ సరైన దిశలో ముందుకు సాగుతోందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు వంటి నగరాలు ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదుగుతున్నాయని, స్థానిక ఏఐ మోడళ్ల అభివృద్ధి దేశాన్ని అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా నిలబెడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై విద్యార్థులు, నిపుణులతో సాంకేతిక సహకారం పెంపుపై చర్చించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ విస్తరణకు టెక్ దిగ్గజాలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏఐ అంతరాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ దశాబ్దం చివరికల్లా 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. భారత్లో 2030 నాటికి రెండు కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాల్కామ్ భారత స్టార్టప్లకు 150 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించగా, ఎన్విడియా భారత్ను కీలక ఏఐ ఆవిష్కరణ కేంద్రంగా పేర్కొంది. ఏజెంటిక్ ఏఐ తర్వాత మెషీన్ వాయిస్ టెక్నాలజీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే దశాబ్దంలో టెక్నాలజీ, ఏఐ ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ మార్కెట్ అవకాశాలు ఏర్పడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!