

ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం పై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే గంటల్లో పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాతి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతం లో తుఫానుగా బలపడవచ్చని అంచనా. ఇదిలావుండగా, ఉపరితల ఆవర్తనం కారణంగా కొమొరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాల సమీపంలో మరో అల్పపీడనం క్రియాశీలంగా ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది.
ఈ వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మత్స్యకారులు నవంబర్ 27 నుంచి సముద్ర యాత్రలకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరాలని సూచించారు.
రైతులకు సంబంధించి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంట పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన రక్షణ చర్యలు ముందుగానే చేపట్టాలని విపత్తు నిర్వాహక అధికారులు సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!