

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక వాణిజ్య సుంకాల విషయంలో ఆయన ప్రభుత్వానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అధిక సుంకాల కింద కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని న్యూయార్క్ ట్రేడ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ‘అట్మస్ ఫిల్ట్రేషన్’ అనే సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, దిగుమతిదారులు చెల్లించిన అదనపు సుంకాలను తిరిగి పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ కేసుల విచారణను తానే కొనసాగిస్తానని ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ తెలిపారు. అయితే ఈ తీర్పును అప్పీల్ చేస్తామని ట్రంప్ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.
ఇదివరకు 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్కే ఉంటుందని, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది. ఈ తాజా తీర్పుతో అమెరికా ఖజానాపై భారీ భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.15.88 లక్షల కోట్ల మేర సుంకాల సొమ్మును తిరిగి చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో ట్రంప్ విధించిన కొత్త సుంకాలపై 20 అమెరికా రాష్ట్రాలు కూడా కోర్టును ఆశ్రయించాయి










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!