

పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్ నిధులను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో మొత్తం రూ.5,936 కోట్లు కేటాయించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అడ్వాన్స్ నిధులను ఈ ఏడాది మార్చి వరకు ఖర్చు చేసిన కారణంగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూ.3,017.40 కోట్లకు సవరించింది.
ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన అడ్వాన్స్ నిధుల్లో సుమారు 80 శాతం ఖర్చు చేసిన నేపథ్యంలో, మూడో విడత నిధులను విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన కేంద్రం ప్రస్తుతం రూ.1,508 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చింది.
అయితే ఈ నిధులను మార్చి 15 లోపు ఖర్చు చేస్తేనే ప్రస్తుత బడ్జెట్లో మిగిలిన నిధులను విడుదల చేస్తామని కేంద్రం షరతు విధించింది. ప్రారంభంలో సింగిల్ నోడల్ ఖాతాకు కాకుండా స్పర్శ్ విధానం ద్వారా నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ సూచించింది. అయితే దీని పై రాష్ట్ర ఆర్థికశాఖ మరియు పోలవరం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, చివరకు పాత సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానంలోనే నిధులను విడుదల చేశారు. ఈ నిధుల్లో ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూ.500 కోట్ల వరకు పోలవరం ఖాతాకు జమ చేసింది.
ఈ నిధుల్లో సుమారు రూ.500 కోట్లు పోలవరం నిర్మాణ పనులకు, మరో రూ.500 కోట్లు పునరావాస కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కొన్ని పనులకు సంబంధించిన బిల్లులను తగ్గించారని, వాటిని మళ్లీ ఆమోదించాలని పోలవరం అధికారులు కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి మొత్తం రూ.7,020 కోట్లు అందాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా రూ.5,512.40 కోట్ల అడ్వాన్స్ నిధులు లభించగా, తాజా ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1,508 కోట్లు విడుదలయ్యాయి.
ఇక ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో చూపిన రూ.1,500 కోట్లు వినియోగించుకోలేకపోతే, ప్రాజెక్టు తొలి దశ పూర్తి కోసం కేంద్రం నుంచి ఇంకా సుమారు రూ.1,800 కోట్ల వరకు నిధులు అందాల్సి ఉంటుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!