

పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ఇప్పుడు దిల్లీకి చేరింది. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకుని దిల్లీకి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల సంఘంతో తీవ్రంగా విభేదించారు. సోమవారం సాయంత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తో జరిగిన భేటీలో అసంతృప్తి వ్యక్తం చేసిన మమత, సమావేశాన్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈసీ అహంకారపూరితంగా వ్యవహరించిందని, తమ ప్రతినిధులను అవమానించిందని ఆరోపించారు. సర్ ప్రక్రియ కారణంగా ప్రాణనష్టాలు జరిగినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇదే సమయంలో, దిల్లీలోని బంగ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న దిల్లీ పోలీసులు తో ఆమె వాగ్వాదానికి దిగారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సర్ బాధితులు బంగ భవన్లో బస చేస్తున్నారని, వారికి అడ్డంకులు సృష్టించడం తగదని అన్నారు. మరోవైపు, మమతా బెనర్జీ ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండించింది. టీఎంసీ ప్రతినిధులకు సమాధానం ఇస్తున్న సమయంలోనే మమత ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయారని ఈసీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!