

తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన మంజుల అనేక సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు వంటి ప్రముఖ నటులతో కలిసి ‘మనుషులంతా ఒక్కటే’, ‘మగాడు’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘దొరబాబు’, ‘బంగారు బొమ్మలు’, ‘మహాకవి క్షేత్రయ్య’, ‘మాయదారి మల్లిగాడు’, ‘రక్తసంబంధాలు’, ‘మంచి మనుషులు’, ‘పిచ్చిమారాజు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ, మంజుల కూతురు వనితను ‘దేవి’ సినిమాతో నటిగా పరిచయం చేసిన దర్శకుడు ఎం.ఎస్. రాజు, ఇప్పుడు వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్ను ‘అగధ’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో జోవికా ‘హరిణి’ అనే పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్లో ఆమె వర్షంలో, పురాతన నేపథ్యంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, అమాయకత్వం మరియు అంతర్ముఖ శక్తిని ప్రతిబింబించేలా కనిపించింది.
‘అగధ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు సినిమా ఇంటెన్సిటీని బలంగా చూపిస్తున్నాయి. ఎం.ఎస్. రాజు కథ, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సుమారు 85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్లు, దాదాపు 45 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం ప్రత్యేకమైన అనుభూతిని అందించనుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ‘అగధ’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!