

‘‘థియేటర్లలో ‘శంబాల’ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు’’ అని హీరో ఆది సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆది కథానాయకుడిగా నటించగా, రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. అర్చన అయ్యర్ కథానాయికగా నటించగా, స్వసిక, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరోలు కిరణ్ అబ్బవరం, మంచు మనోజ్, ప్రియదర్శి, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “హిట్లు కొట్టడమే కాదు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆది ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ, ‘‘దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన టీజర్, ప్రభాస్, నాని విడుదల చేసిన ట్రైలర్లు మా సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. దర్శకుడు యుగంధర్ ముని ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న నాకు హిట్ రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో విజయం అందుకుంటాం’’ అన్నారు. ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాతో నా పేరు, అభిమానుల పేరు ఆది నిలబెడతాడు. తనకు చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, చిత్రబృందానికి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!