

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్కలు మిగిలిపోవడం సాధారణమే. వాటిని పారేయకుండా రుచికరమైన పచ్చి కొబ్బరి కోఫ్తా కర్రీగా మార్చుకోవచ్చు. ఈ కర్రీ అన్నం, బగారా రైస్, రోటీ, చపాతీ, పులావ్, పుల్కాతో చక్కగా సరిపోతుంది. ముఖ్యంగా రోటీతో కలిపి తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ముందుగా చింతపండును నానబెట్టి చిక్కటి రసం తీసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలను విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి, అల్లం, వెల్లుల్లితో కలిపి మెత్తటి మసాలా పేస్ట్గా తయారు చేసుకోవాలి.
కోఫ్తాల కోసం పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి, శెనగపిండి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి. వీటిని సుమారు 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. అనంతరం పాన్లో నూనె వేడి చేసి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరతో పోపు పెట్టి మసాలా పేస్ట్ను వేయించాలి. చింతపండు రసం, అవసరమైన నీటిని కలిపి గ్రేవీని మరిగించి, స్టీమ్ చేసిన కోఫ్తా బాల్స్ను వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపితే రుచికరమైన పచ్చి కొబ్బరి కోఫ్తా కర్రీ సిద్ధం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!