

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో భూముల ధరలను 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచగా, కొన్ని ప్రాంతాల్లో 200 శాతం వరకు పెంపు చేశారు. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి రావడంతో కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండ, కాజీపేట, హసన్పర్తి, ఎల్కతుర్తి, వరంగల్, దామెర, గీసుకొండ, సంగెం, ఖిల్లా వరంగల్ ప్రాంతాల్లో ధరల పెంపు ఎక్కువగా జరిగింది. హనుమకొండ చౌరస్తా, వరంగల్, జేపీఎన్ రహదారి ప్రాంతాల్లో గజం ధరను రూ.46 వేలుగా నిర్ణయించారు. అనేక ప్రాంతాల్లో 50 శాతం నుంచి 100 శాతం వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయ భూముల కనిష్ఠ ధరను ఎకరానికి రూ.2 లక్షల 70 వేలుగా నిర్ణయించగా, వడ్డెపల్లి, కోటిపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో ఎకరం ధర రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.
గత ఏడాది నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగంపై ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన మార్కెట్ విలువల కారణంగా ముద్రణ సుంకం, రిజిస్ట్రేషన్ రుసుములు, ఇతర పన్నులు కూడా పెరిగాయి. కొంతమంది కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఖర్చులు 50 శాతం నుంచి 80 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా రూ.150 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!