

తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు. అయితే నిరసనలు హింసాత్మకంగా మారకూడదని, ప్రజలకు లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకూడదని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన, ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులు ఏళ్లుగా పెండింగ్లో ఉండటం అమానవీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2021 మే నుంచి 2026 వరకు రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని విజయ్ తెలిపారు. సిప్కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులు, పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లోనూ రైతులపై కేసులు పెట్టారని చెప్పారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన ఉపాధ్యాయులపై కూడా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసులు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు వంటి అంశాల్లో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఎన్ని కేసులు ఉపసంహరించుకుంటారనే పూర్తి సంఖ్యను ప్రభుత్వం వెల్లడించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!