

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయాలకు, రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు కోచింగ్ కేంద్రాలు వేదికలుగా మారకూడదని స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కొందరు నిర్వాహకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు–2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నంబర్ 9లోని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులను రాజకీయ నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా ప్రేరేపించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ భవిష్యత్తు, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని, సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!