

చదువుకోవాలనే తపన, సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఒడిశాకు చెందిన ఐదుగురు తోబుట్టువులు నిరూపించారు. కంధమాల్ జిల్లా సికాబడి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ రైతు కుటుంబంలో పుట్టిన వీరు.. ఆర్థిక ఇబ్బందులు, పరిమిత వసతులను అధిగమించి ఒక్కొక్కరుగా నీట్లో ఉత్తీర్ణత సాధించారు. వీరి తల్లిదండ్రులు బృషినాయక్, అనుశాయ కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో బృషినాయక్ ఇతర రాష్ట్రాలకు వలసకూలీగా వెళ్లి పనిచేశారు. తాను చదువుకోకపోయినా విద్య ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆయన.. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను చదివిస్తున్నారు.
ఈ కుటుంబంలో వైద్య విద్య వైపు తొలి అడుగు వేసింది కుమారుడు బిబీశన్. నీట్లో అర్హత సాధించిన అతడు కొరాపుట్లోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అతడి స్ఫూర్తితో పెద్ద చెల్లెలు మోనాలిసా కూడా నీట్లో అర్హత సాధించి అదే కళాశాలలో రెండో సంవత్సరం వైద్య విద్య చదువుతోంది. మరో ముగ్గురు చెల్లెళ్లు సునేమీ, ఆశ్రియా, మీనాక్షి ఈ ఏడాది నీట్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందారు. వీరిలో మీనాక్షి బృషినాయక్ తమ్ముడు జిశియా కుమార్తె. చిన్నతనం నుంచే ఆమెను బృషినాయక్, అనుశాయ దంపతులే పెంచుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఇప్పటికే రుణాలు తీసుకున్నామని, వైద్య విద్య ఖర్చులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని బృషినాయక్ కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!