

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామంలో మలేరియా మాత్రలు వికటించిన ఘటనలో బాధితులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఏపీలోని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న 23 మందిని ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం భద్రాచలం ఆసుపత్రిలో మొత్తం 52 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
బాధితులు, గ్రామస్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక మడివి జమున మృతి చెందింది. ఆమె జీపీఎస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గొల్లగుప్పలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రస్థాయి, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక వైద్య బృందాలు గ్రామంలో సేవలు అందిస్తున్నాయి. మరోవైపు, ముగ్గురు పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉండి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తూ, కొత్తగా అస్వస్థతకు గురయ్యే వారిని గుర్తించి వెంటనే చికిత్స అందిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!