

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు జిల్లాలు, గుజరాత్లోని అహ్మదాబాద్ సహా మొత్తం 21 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కేపీఎస్సీ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. సస్పెండ్ అయిన కేపీఎస్సీ చైర్మన్ శివశంకరప్ప సాహకార్ నివాసాలతో పాటు, కేపీఎస్సీ ద్వారా వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు.
కేపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన పశువైద్యాధికారుల నియామకాల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.70–80 లక్షల వరకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు శివశంకరప్పపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కేపీఎస్సీ చైర్మన్ శివశంకరప్ప సాహుకార్ను సస్పెండ్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!