

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో దాడి చేయడంతో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిల్లీలోని ఇరాన్ దౌత్యాధికారిని పిలిపించి నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, హింసకు ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
రక్షణ శాఖ వివరాల ప్రకారం ఒమన్ జలాల్లో ప్రయాణిస్తున్న ఎంటీ మొంబాసా, ఎంటీ అల్ బాహియా నౌకలపై ఇరాన్ దాడి చేసింది. మొత్తం 46 మంది సిబ్బందిలో 30 మంది భారతీయులే కాగా, పలువురు గాయపడ్డారు. ఇరాన్ ఈ దాడులకు నౌకల అక్రమ కార్యకలాపాలే కారణమని పేర్కొంది. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్లో హర్మూజ్ సమీపంలో ఏడు భారత నౌకలు నిలిచిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. పరిస్థితులు సాధారణం అయ్యే వరకు అవి కదలలేవని తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!