

ఆషాఢ మాస బోనాల జాతరకు భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
బోనాల సందర్భంగా 29 ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కర్ణాటక నుంచి లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించగా, భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, క్యూ లైన్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం దేవాదాయ శాఖ, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!