

పలు కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుమారు తొమ్మిది నెలల తర్వాత భార్య బుష్రా బీబీ, సోదరి నోరీన్ నియాజీని కలిశారు. జైలు కాన్ఫరెన్స్ రూమ్లో జరిగిన ఈ భేటీ భావోద్వేగంగా సాగినట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకోవడంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.
నోరీన్ నియాజీ తన సోదరుడితో సుమారు 15 నిమిషాలు మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై చర్చించడంతో పాటు, వైద్య పరీక్షల కోసం ఆయనను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ను కుటుంబ సభ్యులు కలిసేందుకు పరిమితులు ఉండటంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఇమ్రాన్ను కలవడానికి, ఆయన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను జైలు అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. తాజా భేటీ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే అడియాలా జైలులో ఉన్న బుష్రా బీబీ తన పిల్లలు, వదినను కూడా కలిశారు. ఇమ్రాన్ను వివాహం చేసుకునే ముందు బుష్రా బీబీకి మరో వివాహం జరిగింది. ఆ వివాహం ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!