

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీని తితిదే సమర్థంగా నిర్వహిస్తోంది. గతంలో కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు సామాన్య భక్తులు 7 నుంచి 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం పొందుతున్నారు. వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖల రద్దు, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) మరియు సీసీటీవీ పర్యవేక్షణతో క్యూలైన్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారింది. సర్వదర్శనానికి గరిష్టంగా 8 గంటల లోపే వేచిచూడే సమయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
స్లాటెడ్ సర్వదర్శనం 2 నుంచి 3 గంటల్లో పూర్తవుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం సుమారు రెండున్నర గంటల్లో పూర్తవుతోంది. రోజుకు లక్ష మంది వరకు భక్తులు వచ్చినా దర్శన సమయాన్ని నియంత్రించగలుగుతున్నారు. వీఐపీ సిఫార్సు లేఖల రద్దుతో క్యూలైన్ల కదలిక వేగంగా జరుగుతోంది. గత మూడు రోజుల్లో 2,45,686 మంది భక్తులు దర్శనం చేసుకోగా రూ.11.95 కోట్ల ఆదాయం వచ్చింది. మే 3న అత్యధికంగా రూ.5.06 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ముందుగా నిర్ణయించిన రూ.300 దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఎన్ఆర్ఐ కోటా, వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!