

ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువ కావాలంటే ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. ఈ లక్ష్యంతో 2006 ఆగస్టు 23న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజా భద్రతకు సంబంధించి పలు వినూత్న కార్యక్రమాలను కౌన్సిల్ నిర్వహిస్తోందన్నారు. మహిళల భద్రత కోసం ‘షీ షటిల్స్’, విద్యార్థుల విద్య, భవిష్యత్తు కోసం ‘చైతన్య’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు. తాను సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన సమయంలో కొంత నిర్వీర్యమైన స్థితిలో ఉన్న కౌన్సిల్కు తిరిగి జీవం పోసి, ప్రజా భద్రతలో సమర్థవంతమైన భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు.
పబ్లిక్, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సి.వి. ఆనంద్ తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసులతో కలిసి నిరంతరం పనిచేసేలా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను బలోపేతం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కౌన్సిల్ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా భద్రతలో పోలీసుల పాత్రను మరింత విస్తరించడంలో కీలక భాగస్వామిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. కౌన్సిల్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు, భాగస్వామ్య సంస్థలు, గతంలో దానితో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ డీజీపీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ప్రజా భద్రతకు సేవలందించాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!