

కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను మేజర్ సర్జరీలు కూడా నిర్వహించగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీచింగ్ హాస్పిటళ్లకు సమానంగా స్థానికంగానే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం జిల్లా, ఏరియా ఆసుపత్రులకు ఉందని పేర్కొన్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించినట్లు తెలిపారు. డాక్టర్లు, సిబ్బందితో పాటు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవలు, మౌలిక వసతులు, మానవ వనరులు, పరికరాలపై హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసే విధానాన్ని మార్చాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రిఫర్ చేయాలని, అలా చేయాల్సి వస్తే ముందుగానే సంబంధిత ఆసుపత్రికి సమాచారం ఇచ్చి వైద్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్య సేవలను పూర్తిస్థాయిలో వినియోగించకుండా రోగులను పైస్థాయి ఆసుపత్రులకు పంపితే వారిపై అదనపు భారం పడటంతో పాటు టెర్షియరీ ఆసుపత్రులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అవసరమైన ఆసుపత్రుల్లో కొత్త సీటీ స్కాన్లు, ఇతర వైద్య, డయాగ్నస్టిక్ పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్ఎస్లను ఆదేశించారు. పరికరాల కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడు రోగుల సంఖ్య, అవసరం, సేవల వినియోగం వంటి అంశాలతో స్పష్టమైన జస్టిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!