

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఆర్మీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లో 8 బండిల్స్లో మొత్తం 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ సూచనల మేరకు అధికారులు వాటిని భద్రపరిచారు. వీటి విలువ సుమారు రూ.32 వేలు ఉంటుందని సమాచారం. డిటోనేటర్లను అక్కడికి తీసుకొచ్చి వదిలి వెళ్లింది ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రెండ్రోజుల క్రితం ఆయుధాలు భద్రపరిచే గది తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు సమాచారం. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు పలు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా డిటోనేటర్లు బయటపడటంతో ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!