

సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు రోజురోజుకూ జటిలమవుతోంది. కేసు నమోదై 48 గంటలు గడిచినా ఇప్పటివరకు కీలక ఆధారం లభించకపోవడం పోలీసులను, సైనిక అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. చోరీకి గురైన ఆయుధాలు సంఘవిద్రోహ లేదా దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన ఆయుధాలకు సరిపోయే మందుగుండు సామగ్రిని కూడా దుండగులు తీసుకెళ్లినట్లు గుర్తించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. దీంతో ఇది పక్కా ప్రణాళికతో జరిగిన చోరీ అయి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆయుధాగారం, అందులోని నిల్వలు, రెజిమెంట్ భౌగోళిక పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై పూర్తి అవగాహన ఉన్నవారి ప్రమేయం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పోలీసులు, సైనిక అధికారులు విచారిస్తున్నారు. రెజిమెంట్కు దారితీసే మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా అవకాశం దొరికినప్పుడల్లా మందుగుండు సామగ్రిని కొద్దికొద్దిగా తరలించి, అనంతరం ఆయుధాలను చోరీ చేసి ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వలకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తాళం పగులగొట్టడం, మందుగుండు పెట్టెలను ధ్వంసం చేసినప్పటికీ సమీపంలోని సిబ్బందికి ఎలాంటి శబ్దం వినిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రెజిమెంట్లో పనిచేసే వారిలో ఎవరినైనా హనీట్రాప్ ద్వారా ప్రభావితం చేసి చోరీకి సహకరింపజేశారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తూ.. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా ఆరా తీస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!