

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్లో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు శిథిలాల కింద చిక్కుకున్న నేపథ్యంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవనం బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఇటీవలి వర్షాలకు నీరు చేరిందని, దాంతో పునాదులు బలహీనపడి ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనతో దిల్లీలో అనధికారిక నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. తగిన తనిఖీలు లేకుండానే భవన నిర్మాణాలు, మరమ్మతులకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని బహుళ అంతస్తుల భవనాల్లో హాస్టళ్లు, హోటళ్లు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజీవ్ ఖిర్వార్ 2022లో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు త్యాగరాజ్ స్టేడియాన్ని వినియోగించారనే ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో కేంద్రం ఆయనను లద్దాఖ్కు బదిలీ చేయగా, ఈ ఏడాది జనవరిలో తిరిగి దిల్లీకి రప్పించి ఎంసీడీ కమిషనర్గా నియమించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!