

క్యాబ్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్ చెల్లించేలా ప్రోత్సహించవద్దని ఓలా, ఉబర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైడ్ ప్రారంభానికి ముందే టిప్ చెల్లింపు ఆప్షన్ కనిపించకూడదని స్పష్టం చేసింది. అదనంగా టిప్ చెల్లిస్తే రైడ్ త్వరగా లభిస్తుందని, డ్రైవర్ వెంటనే రైడ్ను అంగీకరిస్తారని లేదా బుకింగ్ త్వరగా ఖరారవుతుందని ప్రయాణికుల్లో భావన కలిగించేలా ఎలాంటి సందేశాలు, నోటిఫికేషన్లు, ఆప్షన్లు ఉండకూడదని పేర్కొంది.
ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ప్రయాణికులు తమ ఇష్టప్రకారం డ్రైవర్కు టిప్ ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికుడు చెల్లించే టిప్ మొత్తం డ్రైవర్కే అందాలని, అందులో ఎలాంటి వాటా అగ్రిగేటర్ లేదా క్యాబ్ కంపెనీకి వెళ్లకూడదని తెలిపింది. కొన్ని రైడ్ హైలింగ్ యాప్లలో ముందస్తు టిప్, అదనపు చెల్లింపులతో రైడ్ త్వరగా నిర్ధారించుకోవచ్చనే సూచనలు కనిపిస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ముందస్తు టిప్ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించగా, తాజా రవాణా శాఖ ఆదేశాలతో నిబంధన మరింత స్పష్టమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!