

ప్రభుత్వ వాహనాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఒక అధికారి–ఒక అధికారిక కారు' విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అధికారులకు మరో ప్రభుత్వ వాహనం కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారిక కారుకు అర్హత ఉన్న అధికారి మరో మంత్రిత్వ శాఖ, విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి సంస్థలో అదనపు బాధ్యతలు నిర్వహించినా ప్రత్యేకంగా మరో వాహనం ఇవ్వబోమని తెలిపింది. అలాంటి అధికారులు తమకు ఇప్పటికే కేటాయించిన అధికారిక వాహనాన్నే అన్ని విధుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.
అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు లేదా ఇతర అర్ధ ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడంపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. అధికారిక విధులు, అనుమతించిన పర్యటనల సమయంలో మాత్రమే వాటిని వినియోగించాలని సూచించింది. వినియోగంలో లేని అదనపు వాహనాలను భద్రంగా ఉంచాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వాహనాల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అనవసర వ్యయాలను తగ్గించడం, ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని, ప్రజాప్రతినిధుల వాహన సదుపాయాలపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!