

క్యాన్సర్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర పోరాటం ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 1.84 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 35 కోట్ల మందికి నోటి క్యాన్సర్, 16 కోట్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్, 9 కోట్ల మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ముందస్తు గుర్తింపు వల్ల ప్రాణాలను కాపాడడంతో పాటు చికిత్స భారం కూడా తగ్గుతుందని చెప్పారు.
2014కు ముందు 384గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 820కి పెరిగిందని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 62 కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి సేవలను ఆమె ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!