

ఆరంకెల జీతం, హెచ్1బీ వీసా వంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఓ భారత సంతతి యువతి అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం, 28 ఏళ్ల దిశా లాంబా 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అనంతరం 2024లో CVS హెల్త్లో డేటా సైంటిస్ట్గా ఉద్యోగం సాధించి, భారీ వేతనంతో పాటు హెచ్1బీ వీసా లాటరీలోనూ విజయం సాధించారు.
అయితే అమెరికాలో కొనసాగడంపై దిశా లాంబాకు క్రమంగా ఆసక్తి తగ్గింది. ఒంటరితనం, భారతదేశంలోని తల్లిదండ్రులతో అమెరికా సమయానికి అనుగుణంగా మాట్లాడాల్సి రావడం తనను మానసికంగా ప్రభావితం చేశాయని ఆమె వెల్లడించారు. హెచ్1బీ వీసా నిబంధనల కారణంగా ఉద్యోగం మార్చడం, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం, తరచూ ప్రయాణాలు చేయడం లేదా కెరీర్ బ్రేక్ తీసుకోవడం కూడా సులభంగా లేదని చెప్పారు.
2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసిన దిశా లాంబా గురుగ్రామ్లోని తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం కెరీర్ బ్రేక్ తీసుకుని భారత్లోనే కొత్త అవకాశాలను అన్వేషించడంతో పాటు సొంత వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో అమెరికా హెచ్1బీ వీసా విధానంలో ఫీజుల పెంపు, 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపు, హెచ్4 వీసా కలిగిన జీవిత భాగస్వాముల ఉద్యోగ అనుమతులపై పరిమితులు వంటి ప్రతిపాదనలు వెలువడుతున్నాయి. ఈ మార్పులు భారతీయ హెచ్1బీ కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!