

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. ఈ ఘటనలో సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలంటూ నిందితుడిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం మొత్తాన్ని తీసుకునే బాధ్యతను సీఐ ఎస్సై జ్ఞానేందర్రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. దీంతో డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఆపరేషన్ చేపట్టారు.
కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై.. బాధితుడి నుంచి రూ.5 లక్షలు లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకోవడంతో ఎస్సై అక్కడి నుంచి పరుగులు తీసినట్లు సమాచారం. కెమికల్ పరీక్షలు నిర్వహించకుండా ఆయన ప్రతిఘటించినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎస్సై జ్ఞానేందర్రెడ్డితో పాటు సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఘటనపై తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!