

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత ఆసియాలో భారత్ స్థానం మరింత బలపడిందని జేఎం ఫైనాన్షియల్ (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఇండియా – యూఎస్ ట్రేడ్ డీల్ భారత మార్కెట్లకు అనుకూలంగా ఉంటుందని, ముఖ్యంగా భారత కరెన్సీ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. పాకిస్థాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఇతర ఆసియా దేశాలపై అమలులో ఉన్న అధిక సుంకాలతో పోలిస్తే ఇది భారత్కు పెద్ద ప్రయోజనంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది.
సుంకాల తగ్గింపుతో భారత ఎగుమతులు వేగం పుంజుకునే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. దీని వల్ల అమెరికాతో వాణిజ్య మిగులు మళ్లీ పెరగడమే కాకుండా, దేశంలోకి డాలర్ల ప్రవాహం కూడా అధికమవుతుందని తెలిపింది. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడే అవకాశముందని పేర్కొంది. ఇవన్నీ భారత ఈక్విటీ మార్కెట్లకు, ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన రంగాలకు సానుకూల సంకేతాలుగా నిలుస్తాయని వివరించింది. అధిక సుంకాలు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీ సామర్థ్యం మెరుగైందని అభిప్రాయపడింది. అయితే విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని కూడా నివేదిక సూచించింది.
ఇదే సమయంలో భారత్ – అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఖరారైనట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ డీల్ వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!