

దేశంలో ఊబకాయం, టైప్–2 మధుమేహం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి చికిత్సలో ఉపయోగించే సెమాగ్లుటైడ్ ఔషధానికి డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఔషధ కంపెనీలు తక్కువ ధరల్లో జనరిక్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీంతో పోటీ పెరగడంతో డెన్మార్క్కు చెందిన నొవో నార్డిస్క్ తమ బ్రాండెడ్ ఔషధాల ధరలను గణనీయంగా తగ్గించింది.
ఈ క్రమంలో ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్ బ్రాండ్లైన ఒజెంపిక్ ధరను 36% మరియు వెగోవీ ధరను 48% వరకు తగ్గించారు. అయితే ఓరల్ బ్రాండ్ అయిన రీబెల్సస్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ధరల కోతలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా ధరల ప్రకారం 0.25 ఎంజీ డోసు ఒజెంపిక్, వెగోవీ నెలవారీ ధరలు రూ.8,800, రూ.10,848 నుంచి తగ్గి రూ.5,660కు చేరాయి. ప్రస్తుతం ఒజెంపిక్ మూడు డోసుల్లో (0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ) లభిస్తుండగా, వాటి ధరలు రూ.5,660 నుంచి రూ.9,100 మధ్య ఉన్నాయి. వెగోవీ ఐదు రకాల డోసుల్లో అందుబాటులో ఉండి, వాటి ధరలు రూ.5,660 నుంచి రూ.16,400 వరకు ఉన్నాయి.
ఒజెంపిక్ను ప్రధానంగా మధుమేహ నియంత్రణకు, వెగోవీని బరువు నియంత్రణ మరియు ఊబకాయం చికిత్సకు ఉపయోగిస్తున్నారు. తమ వినూత్న చికిత్సలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ధరల సవరణలు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు, దేశీయ కంపెనీలు కూడా పోటీగా తక్కువ ధరల్లో సెమాగ్లుటైడ్ జనరిక్ వేరియంట్లను అందిస్తున్నాయి. నాట్కో ఫార్మా పెన్ బేస్డ్ వర్షన్ నెలకు రూ.4,000–4,500 మధ్య ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ఇంజెక్టబుల్ వర్షన్ ధర సుమారు రూ.4,200గా ఉంది. సన్ ఫార్మా సెమాట్రినిటీ ధర రూ.3,000–5,200 మధ్య ఉండగా, నేవెల్ట్రీట్ ధర రూ.3,600–8,000 మధ్య ఉంది.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!