

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమిక రవి చేసిన తాజా వ్యాఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థ, రూపాయి భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీశాయి. ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹100కు చేరినా దానిని సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. మారకపు విలువ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా బలంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ఠ స్థాయిలకు సమీపంలో కొనసాగుతోంది. గురువారం రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే ₹95.78 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మార్కెట్ పరిస్థితులకు విరుద్ధంగా ప్రభుత్వాలు కరెన్సీ విలువను కృత్రిమంగా నిలబెట్టేందుకు ప్రయత్నించకూడదని షమికా రవి అభిప్రాయపడ్డారు.
అయితే ఆమె వ్యాఖ్యలు ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకుల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి. రూపాయి బలహీనపడితే ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడటంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెరగవచ్చు. రూపాయి క్షీణత ఆందోళనకరమా లేక ఆర్థిక వృద్ధిలో సహజ పరిణామమా అనే చర్చ మరింత వేగం పుంజుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!