

భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ సభ్యులు క్లయింట్లకు చెందిన చెల్లించని సెక్యూరిటీల నిర్వహణ కోసం సరికొత్త నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల లక్ష్యం మదుపర్ల ప్రయోజనాలను రక్షించడం మరియు సెక్యూరిటీ మార్కెట్లో పారదర్శకతను పెంచడం. కొత్త మార్గదర్శకాల ప్రకారం, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీకి సంబంధం లేకుండా కొనుగోలు చేసిన సెక్యూరిటీలు చెల్లింపు పెండింగ్లో ఉన్నా, క్లయింట్ల డీమ్యాట్ ఖాతాలోనే నేరుగా జమ అవుతాయి. అవసరమైతే ఈ సెక్యూరిటీలను క్లయింట్ల అనుమతి లేకుండానే సీయూఎస్పీఏ ఖాతాలో ఆటోమేటిక్గా తనఖా రూపంలో ఉంచవచ్చు.
ట్రేడింగ్ సభ్యులు వెంటనే క్లయింట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేయాలి. నిర్ణీత గడువులో చెల్లింపులు జరగకపోతే తనఖా షేర్లను విక్రయించి బకాయిలను వసూలు చేయవచ్చు. ఐదు ట్రేడింగ్ రోజుల్లో చెల్లింపు జరగకపోతే విక్రయం చేయవచ్చు, లేకపోతే ఆరవ రోజున డిపాజిటరీలు వాటిని ఆటోమేటిక్గా విడుదల చేస్తాయి. ఈ సెక్యూరిటీలను బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీల నుంచి నిధులు సమీకరించేందుకు వినియోగించడాన్ని సెబీ నిషేధించింది. ఈ నిబంధనలను 30 రోజుల్లో అమలు చేయాలని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆదేశాలు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!