

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో వంట గ్యాస్ సరఫరా పై ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. దీనితో విద్యుత్తుతో పనిచేసే కిచెన్ పరికరాల పై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్టాప్లకు గిరాకీ భారీగా పెరిగిందని టాటా గ్రూప్కు చెందిన క్రోమా సంస్థ తెలిపింది. సాధారణంగా ఉండే అమ్మకాలతో పోలిస్తే ఇండక్షన్ కుక్టాప్ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. అలాగే ఎలక్ట్రిక్ కెటిల్స్కు కూడా గిరాకీ పెరిగి, అమ్మకాలు రెట్టింపు అయినట్లు ఇన్ఫినిటీ రిటెయిల్ లిమిటెడ్ (క్రోమా) సీఈఓ, ఎండీ శిబాశిష్ రాయ్ తెలిపారు.
కిచెన్ ఉపకరణాల బ్రాండ్ పిజియన్ను తయారు చేసే స్టోవ్క్రాఫ్ట్ లిమిటెడ్ కూడా అమ్మకాల పెరుగుదల గురించి వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఆన్లైన్లో ఇండక్షన్ కుక్టాప్ల సగటు వారపు అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని కంపెనీ ఎండీ రాజేంద్ర గాంధీ తెలిపారు.
ఇక అమెజాన్ ఇండియా కూడా విద్యుత్ ఆధారిత కిచెన్ పరికరాల అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదైందని తెలిపింది. ఇండక్షన్ కుక్టాప్ల అమ్మకాలు 30 రెట్లు పెరిగాయని పేర్కొంది. రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ల విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయని వెల్లడించింది. అలాగే ఎయిర్ ఫ్రైయర్లు, మల్టీ యూజ్ కెటిల్స్ అమ్మకాలు కూడా సాధారణ రోజుల కంటే రెండింతలు పెరిగినట్లు తెలిపింది.
దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో వినియోగదారులు త్వరగా ఈ ఉత్పత్తులను పొందేందుకు అమెజాన్ నౌ సేవను ఉపయోగిస్తున్నారని సంస్థ వివరించింది.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!