

‘పర్పెచువల్ కాపిటల్ – హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 – 2026’ జాబితాను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేస్తున్న దేశంలోని 50 ప్రముఖ కంపెనీలను ఈ జాబితాలో ఎంపిక చేశారు. వాతావరణ పరిరక్షణ, నీటి సమర్థ వినియోగం, లింగ సమానత్వం తదితర 17 ప్రమాణాల ఆధారంగా సంస్థలను ఎంపిక చేసినట్లు హురున్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ తెలిపారు.
ఈ జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, దివీస్ లేబరేటరీస్ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రస్తుత ఏడాది జాబితాలో ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం హిందూస్థాన్ యూనిలీవర్ మొదటి స్థానంలో నిలవగా, ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానాన్ని సాధించింది.
మొత్తం 150 కంపెనీల పనితీరును సమీక్షించి, అందులో నుంచి తుది 50 సంస్థలను 2026 జాబితాకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ 50 కంపెనీల మార్కెట్ క్యాప్ సుమారు 1.8 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.162 లక్షల కోట్లు)గా ఉండగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఇవి సుమారు 100 కోట్ల డాలర్లు (దాదాపు రూ.9,000 కోట్లు) వ్యయం చేసినట్లు వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!