

అదానీ గ్రూప్ తన వ్యాపార విస్తరణను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో వాణిజ్య విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్తో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఈ నెల 27న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో రెండు కంపెనీల ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఎంబ్రాయర్ వాణిజ్య విమానాల కోసం తుది అసెంబ్లింగ్ లైన్ (ఫైనల్ అసెంబ్లీ లైన్ – FAL) ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు జాయింట్ వెంచర్గా కొనసాగుతుందా? లేక పూర్తిగా అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి నిర్ణయానికి కారణం ఏమిటంటే… దేశంలో పౌర విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండిగో, ఆకాశ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ నిర్వహిస్తున్న ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ఇప్పటికే ఎయిర్బస్, బోయింగ్ కంపెనీలకు 1,200కుపైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అంతేకాదు, ప్రాంతీయ విమానయాన అవసరాల కోసం రాబోయే 20 ఏళ్లలో దేశీయ విమానయాన సంస్థలు మరో 500 వరకు విమానాలను కొనుగోలు చేయనున్నట్లు అంచనా.
ఇప్పటికే విమానాశ్రయాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్, ఈ పెరుగుతున్న అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తోంది. ముందుగా విమానాల అసెంబ్లింగ్ విభాగంలోకి, తదుపరి వాటికి అవసరమైన విడిభాగాల తయారీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో అదానీ గ్రూప్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!