

ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. జూన్ అప్రైజల్ సైకిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త 50:50 ఫార్ములా ప్రకారం, ఉద్యోగికి మంజూరైన వేతన పెంపులో 50 శాతం మాత్రమే మూల వేతనంలో కలుస్తుంది. మిగిలిన 50 శాతం ఒకేసారి చెల్లించే ప్రత్యేక మొత్తంగా ఉద్యోగికి అందజేస్తారు. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు ఈ విధానం వర్తించదని సంస్థ తన అంతర్గత మెమోలో స్పష్టం చేసింది.
ఉద్యోగి ప్రతిభ, పనితీరు ఆధారంగా వేతన పెంపు శాతాన్ని గ్రూప్ లీడర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు 3 శాతం జీతం పెరిగితే అందులో 1.5 శాతం మూల వేతనంలో చేరగా, మిగిలిన 1.5 శాతం ఒకేసారి చెల్లిస్తారు. ఈ విధానం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులకు వేతన పెంపు అందించడంతో పాటు కంపెనీ దీర్ఘకాలిక పేరోల్ వ్యయాన్ని నియంత్రించవచ్చని యాక్సెంచర్ భావిస్తోంది. అలాగే ఈ వన్టైమ్ చెల్లింపు డిసెంబర్లో ఇచ్చే వార్షిక బోనస్కు ప్రత్యామ్నాయం కాదని సంస్థ స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!