

దేశంలో కోట్ల మంది ఉపయోగించే వాట్సాప్ వెబ్ సేవల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఆఫీసు పనులు మరియు ఎక్కువసేపు చాటింగ్ కోసం వాట్సాప్ వెబ్ను ఉపయోగించే వినియోగదారులకు ఈ కొత్త రూల్స్ ప్రభావం చూపనున్నాయి. కొత్త భారతీయ నిబంధనల ప్రకారం, ఇకపై వాట్సాప్ వెబ్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది.
వాట్సాప్ వెబ్ అనేది యూజర్ మొబైల్లో ఉన్న యాక్టివ్ సిమ్తో అనుసంధానంగా పనిచేస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం, లింక్ భద్రతను ధృవీకరించడానికి వాట్సాప్ వెబ్ సెషన్ను ఆరు గంటలకు మించి నిరంతరాయంగా కొనసాగించలేరు. ప్రస్తుతం ఒకసారి లింక్ చేస్తే మొబైల్ ఆన్లైన్లో ఉన్నంతవరకు రోజులు తరబడి వాట్సాప్ వెబ్ పనిచేస్తుంది. అయితే కొత్త రూల్తో ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అవుతుంది, ఆ తర్వాత మళ్లీ QR కోడ్ స్కాన్ చేసి లాగిన్ కావాలి. నిరంతరం పనిచేసే వారికి ఇది అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు మరియు ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఈ రూల్ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. సిమ్ లేకుండా లేదా విదేశాల నుంచి మెసేజింగ్ యాప్లను దుర్వినియోగం చేసే నేరగాళ్లను గుర్తించేందుకు, ప్రతి యూజర్ కార్యకలాపాన్ని ఒక భౌతిక సిమ్ సబ్స్క్రైబర్కు అనుసంధానించే విధంగా సిమ్ బైండింగ్ను తప్పనిసరి చేశారు. ఈ మార్పులు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ మోసాల నివారణలో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మార్పులు టెలికమ్యూనికేషన్స్ విభాగం విడుదల చేసిన ‘టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025’లో భాగంగా అమలులోకి వస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లు పనిచేయాలంటే అవి తప్పనిసరిగా ఒక యాక్టివ్ సిమ్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. యూజర్ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు చెందిన సిమ్ అదే డివైజ్లో ఉండాలి. సిమ్ లేకుంటే యాప్ పనిచేయదు. ప్రభుత్వం ఈ కొత్త నియమాలను అమలు చేయడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!