

కృత్రిమ మేధస్సు (AI)పై విస్తృత స్థాయిలో కొత్త నియంత్రణలు తీసుకురాకుండా ‘చేతులు దూరంగా ఉంచే’ విధానాన్ని అవలంబించాలని జీ20 దేశాలకు అమెరికా సూచించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంపై భారీగా కొత్త నిబంధనలు తీసుకురావడం కంటే, సాంకేతికత కారణంగా ఏర్పడే కొత్త పరిస్థితులకు మాత్రమే ప్రత్యేక నియమాలు రూపొందించాలని అమెరికా టెక్ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ సూచించారు. నార్త్ కరోలినాలో జీ20 అధికారులు, టెక్ పరిశ్రమ ప్రముఖులతో జరుగుతున్న రెండు రోజుల సమావేశంలో ఆయన ‘కరోలినా ప్రిన్సిపుల్స్’ను ప్రతిపాదించారు. ప్రతి కొత్త టెక్నాలజీని ప్రత్యేక విధాన సమస్యగా చూడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. చైనా కూడా ఈ సూత్రాలకు సంతకం చేసిందని క్రాట్సియోస్ తెలిపారు.
ఏఐ భద్రత, నియంత్రణలు, అమెరికా-చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐ వ్యవస్థలకు భద్రతా పరీక్షలు నిర్వహించాలని గూగుల్ డీప్మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ కోరగా, ఓపెన్-వెయిట్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు విధించవద్దని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సూచించారు. యూరోపియన్ యూనియన్ టెక్ నిబంధనలను స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శించారు. ఏఐ డేటా సెంటర్లకు పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కొత్త ఇంధన వనరులను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఏఐ అభివృద్ధి ప్రభుత్వ విధానాలు, శాస్త్రీయ అవగాహన కంటే వేగంగా సాగుతోందన్న ఆందోళనలు కూడా ఈ చర్చల్లో వ్యక్తమయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!