

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో అవకాశం దక్కకపోవడం పై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబి డెవిలియర్స్ స్పందించారు. సిరాజ్ను ఎంపిక చేయకపోవడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్, నైపుణ్యాల కంటే జట్టు సమతూకంపైనే భారత సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు విశ్లేషించారు.
సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించినప్పటికీ, టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. ఈ ఫార్మాట్లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లకు చోటు దక్కింది. అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉన్న హర్షిత్ రాణా ను జట్టులోకి తీసుకున్నారని ఏబీ డెవిలియర్స్ తెలిపారు.
టీ20 లో కేవలం పేస్ బౌలర్ల పైనే కాకుండా స్పిన్నర్ల పాత్రకూ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఒకవేళ సీమర్లు పరుగులు చేయడంతో పాటు వికెట్లు కూడా తీస్తే అది జట్టుకు అదనపు లాభమని ఆయన పేర్కొన్నారు. ఈ కోణంలోనే సెలక్టర్లు జట్టు కూర్పును నిర్ణయించినట్లు చెప్పారు.
మహ్మద్ సిరాజ్ చివరిసారిగా జూలై 2024 లో టీమ్ ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం బుమ్రా, అర్ష్దీప్లతో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. హర్షిత్ బ్యాట్తోనూ ఉపయోగపడగలగడం అతడికి ప్లస్గా మారిందని, జట్టు సమతూకం కోసమే సెలక్టర్లు అతడిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
టీ20 జట్టుకు ఎంపిక కాకపోయినా, జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్లో సిరాజ్ పాల్గొననున్నాడు. గతంలో ఏబీ డెవిలియర్స్, సిరాజ్ కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ లో ఆడిన విషయం తెలిసిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!