

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించిన గుజరాత్, ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నెల 31న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 47 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 45 పరుగులతో అజేయంగా నిలవగా, చివర్లో డొనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు తీశారు.
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశారు. సాయి సుదర్శన్ 58 పరుగులు చేయగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో రాహుల్ తెవాటియా వేగంగా పరుగులు సాధించడంతో గుజరాత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!