

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 72 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఎస్డీ టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో రూ.6.31 కోట్లతో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. కుమారధార–పసుపుధార డ్యామ్ల వద్ద రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెన, జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటు, కాకులమానుతిప్పలో ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, తిరుమల–తిరుపతిలో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, 2027 డైరీలు–క్యాలెండర్ల ముద్రణ వంటి పలు అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఒంటిమిట్టలో విశ్రాంతి గృహ నిర్మాణం, కోదండరామస్వామి ఆలయానికి బంగారు కవచాలు, గంగమ్మ ఆలయ అభివృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా వేద పండితుల నియామకం, కళాకారుల పారితోషికాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, సామాన్య భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని దాతలకు కల్పించే సౌకర్యాలను పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపారు. కొత్త డోనర్ పాలసీ ప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులను పరిమితం చేసినప్పటికీ, ఇప్పటివరకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!