

క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే పరిణామం చోటు చేసుకుంది. లక్నో లో జరగాల్సిన భారత్–దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టాస్ కూడా వేయలేదు.
సాయంత్రం నుంచి పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు, చివరకు ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్యంతో కూడిన ఘనమైన పొగమంచు కారణంగా ఎకానా స్టేడియంలో దృశ్యమానత పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం లక్నో లో వాయు కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల మధ్య స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మాస్క్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఇరు జట్లు ఆఖరి టీ20 కోసం అహ్మదాబాద్కు వెళ్లనున్నాయి.
ప్రస్తుతం సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ను భారత్ సొంతం చేసుకుంటుంది. నాలుగో టీ20 రద్దవడంతో సిరీస్ ఫలితం నిర్ణయాత్మక మ్యాచ్ పై ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్ రద్దు నేపథ్యంలో శీతాకాలంలో ఉత్తర భారతంలో మ్యాచ్లు షెడ్యూల్ చేయడం పై బీసీసీఐ విధానం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో లక్నో , చండీగఢ్, ధర్మశాల వంటి నగరాల్లో కాలుష్యం, చలి తీవ్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
అధికారికంగా అధిక పొగమంచు కారణంగా మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటించినా, అసలు సమస్య కాలుష్యంతో కలిసిన మంచే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీసీఐ సాధారణంగా వేదికల కేటాయింపులో రొటేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే దక్షిణాఫ్రికాతో ప్రస్తుత సిరీస్ వేదికలను, జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ వేదికలతో మార్చే అంశాన్ని పునఃపరిశీలించాలని పలువురు సూచిస్తున్నారు.
గత వారం ధర్మశాలలో జరిగిన మూడో టీ20 లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. ఆ మ్యాచ్ అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ,
“ఇంత చలిలో ఉన్న మైదానంలో నేను ఎప్పుడూ ఆడలేదు. చాలా కష్టంగా అనిపించింది” అని వ్యాఖ్యానించాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!