

తుపాను తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. జగన్ పర్యటనకు స్పందన చాలా బాగా లభించింది. రైతులు జగన్ తో తమ కష్టాలను మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతునూ ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదని జగన్ విమర్శించారు. వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు చూస్తున్నారు గనుక.. జగన్ కు కౌంటర్ ఇవ్వడం తన బాధ్యత అని ఆయన భావించినట్టుంది. కానీ.. ఏమాత్రం పసలేని కౌంటర్ తో అచ్చెన్నాయుడు నవ్వులపాలు అవుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
ఎందుకంటే.. జగన్ ప్రజల మధ్యలో నిల్చుని.. ప్రభుత్వం ఏ రకంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నదో అచ్చంగా వివరించి చెబుతోంటే.. రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దామా? అని అచ్చెన్నాయుడు సవాలు విసురుతున్నారు. ఇది పూర్తిగా.. చేతగాని సవాలు అనే ప్రజలు అనుకుంటున్నారు. మొక్కుబడిగా చాలా తక్కువ పెట్టుబడి సాయం అందించారని, ఉచిత పంటల బీమా రద్దు చేశారని, ఇన్ పుట్ సబ్సిడీ రద్దు చేశారని, పంటలకు కనీస మద్దతు ధర లేదని, యూరియా సరఫరా కూడా జరగలేదని.. ఇలా జగన్మోహన్ రెడ్డి రకరకాల ఆరోపణలు చేశారు. వీటికి కౌంటర్ ఇవ్వడానికి పూనుకున్న అచ్చెన్నాయుడు మాత్రం.. గత 18నెలల్లో రైతులకోసం వెయ్యికోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీలో చర్చిద్దామా అని సవాలు విసురుతున్నారు. ఈ విషయాలు వెల్లడించడానికి అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అసెంబ్లీకి జగన్ రారు గనుక.. అక్కడ చర్చకు పిలవడం అనేది.. చేతగానితనానికి పరాకాష్టం.
వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడుకు చేతనైతే.. జగన్ చేసిన సూటి ఆరోపణలకు స్పష్టమైన జవాబులు చెప్పాలి. పెట్టుబడి సాయం విషయంలో సర్కారు గట్టి కౌంటరే ఇవ్వవచ్చు. జగన్ వాదన తేలిపోవచ్చు. అయితే మిగిలిన ఆరోపణల సంగతేంటి? పంటల బీమా రద్దు చేయలేదు అని స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్న అచ్చెన్న.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఏయే తేదీల్లో ఎన్ని లక్షల మంది రైతులకు సంబంధించి.. ఎన్ని లక్షల ఎకరాలకు పంటబీమా ప్రీమియంలు చెల్లించిందో డాక్యుమెంటరీ ఆధారాలు బయటపెట్టి జగన్ మరియు ఆయన పార్టీ వారి ఆరోపణలకు తాళం వేవచ్చు కదా అనేది పలువురి సందేహం.
అలా కాకుండా అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నారు. ఒకవేళ జగన్, అచ్చెన్న సవాలును స్వీకరించి అసెంబ్లీకి వచ్చారనే అనుకుందాం. ఈ సవాలు నేపథ్యంలో రైతులకు జరుగుతున్న వంచనపై చర్చను ప్రత్యేకంగా పరిగణించి.. పాలకపక్షానికి ఇచ్చినంత మాట్లాడే సమయం ప్రతిపక్షానికి కూడా ఇప్పించగలరా? అనేది ఒక ప్రశ్న. సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నదని.. అధికార కూటమినుంచి పదిమంది మాట్లాడి.. ప్రతిపక్షంలో ఒకరికి అవకాశం ఇచ్చి.. తప్పుడు మార్గంలో డామినేట్ చేసే కుట్ర తప్ప.. నిజంగా వారు రైతులకోసం పాటుపడి ఉంటే.. ఆ సంగతుల్ని ఆధారాలతో సహా ఏ ప్రెస్ మీట్ లోనో బయటపెట్టవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!