

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)కు భారీ షాక్ తగిలింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అంచనాలకు మించి ప్రదర్శన చేసి అత్యధిక స్థానాలతో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ సహా పలువురు కీలక మంత్రులు ఓటమిని చవిచూడటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా డీఎంకేకు కోటగా భావించిన కొళత్తూర్ నియోజకవర్గంలో స్టాలిన్, టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవడం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఫలితాల అనంతరం స్టాలిన్ సామాజిక మాధ్యమ వేదికలో స్పందిస్తూ ప్రజల తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల నిర్ణయం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, పార్టీగా తమ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే 107 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) కూటమి 53 స్థానాలు సాధించింది. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చి, కొత్త రాజకీయ శక్తిగా టీవీకే ఎదుగుదలను స్పష్టంగా చూపిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!