
.webp&w=3840&q=75)
క్యూబాను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తూ ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ట్రంప్, ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యతో మెక్సికోపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ క్యూబాకు చమురు సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అది అమెరికా ఒత్తిడి వల్ల కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కెనడాపై కూడా ట్రంప్ మరోసారి టారిఫ్ హెచ్చరికలు చేశారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడా విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించారు. జార్జియాలో ఉన్న అమెరికన్ సంస్థ గల్ఫ్స్ట్రీమ్ ఏరోస్పేస్ తయారు చేసిన జెట్లకు సర్టిఫికేషన్ ఇవ్వడాన్ని కెనడా నిరాకరించిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే సరిచేయకపోతే టారిఫ్లు అమలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై కెనడా ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవల చైనాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే 100 శాతం టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, తాజా ప్రకటనలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!