

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ కావడంతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీశ్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీశ్ రావును ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను పార్టీ అధిష్టానం ఆహ్వానించింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ భవన్ నుంచి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకానున్నారు. దీనికి మద్దతుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు తన నివాసంలో న్యాయవాదులతో సమావేశమై ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సిట్ విచారణలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరైనట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!