

శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేమ, శాంతి, మానవ సేవనే ఏసుక్రీస్తు బోధనల సారమని గుర్తు చేశారు. డిసెంబర్ నెలను ‘మిరాకిల్ మంత్’గా అభివర్ణిస్తూ, ఇది క్రీస్తు ఆరాధకులతో పాటు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యేకమైన నెల అని, ఈ నెలలోనే సోనియా గాంధీ జన్మించారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో ఆహార భద్రత చట్టం అమలయ్యిందని, జవహర్ లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు పునాది వేశారని సీఎం గుర్తు చేశారు. పేదలకు విద్య, వైద్యం అందించడంలో క్రిస్టియన్ మిషనరీల సేవలను ప్రశంసించారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని, ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనారిటీలకు సంక్షేమం హక్కేనని, తెలంగాణ రైసింగ్ 2047 విజన్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!