

టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీల అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక చర్యలు చేపట్టారు. ఎంపీలకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ జూన్ 18న పార్టీ ఫిరాయింపుల ఆధారంగా అనర్హత కోరుతూ 1985 నాటి లోక్సభ సభ్యుల అనర్హత నియమావళిలోని రూల్ 6 కింద స్పీకర్కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా స్పీకర్ నుంచి నోటీసులు వెలువడ్డాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం.. స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. టీఎంసీ గుర్తుపై గెలిచిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో చేరారని, ఎన్డీయే కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ చర్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పరిధిలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీస్తాయని అభిషేక్ బెనర్జీ వాదిస్తున్నారు. అయితే, తాము చేపట్టింది చట్టబద్ధమైన పార్టీ విలీన ప్రక్రియేనని తిరుగుబాటు ఎంపీలు చెబుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!