

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యుడినేనని స్పష్టంగా తెలిపారు. పార్టీకి రాజీనామా చేయలేదని, తనపై ఎలాంటి సస్పెన్షన్ లేదా బహిష్కరణ ఉత్తర్వులు కూడా జారీ కాలేదని చెప్పారు. తనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు పూర్తిగా అవాస్తవమని దానం పేర్కొన్నారు. మీడియా కథనాలు, ఊహాగానాల ఆధారంగానే ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారంటూ ఫిర్యాదులు చేయగా, వాటిపై ఈ నెల 30న శాసనసభాపతి విచారణ చేపట్టనున్నారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు సమర్పించిన అఫిడవిట్లో దానం నాగేందర్ తన వాదనను విపులంగా వివరించారు. 2024 మార్చి 15న కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వక వ్యక్తిగత సమావేశమే తప్ప పార్టీ మార్పు కాదని స్పష్టం చేశారు. పిటిషన్లలో కీలక వాస్తవాలు, చట్టబద్ధ ఆధారాలు లేవని, మీడియా క్లిప్పింగులు మాత్రమే జత చేశారని పేర్కొన్నారు. పదో షెడ్యూల్ ప్రకారం శాసనసభలో జరిగే చర్యలకే అనర్హత నిబంధనలు వర్తిస్తాయని, వ్యక్తిగత జీవితానికి వర్తింపజేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో, దానం కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!