

ఎకనామిక్ సర్వే 2025–26 తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని మరోసారి స్పష్టంగా చూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒక అక్రమ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ రాజకీయాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించిన అదే రోజున, ఆర్థిక సర్వే తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని కళ్లకు కట్టిందని వ్యాఖ్యానించారు. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరన్నట్లే, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని దాచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆర్బీఐ, నీతిఆయోగ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు, ది ఎకనామిస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఇప్పటికే కేసీఆర్ పాలనను ప్రశంసించాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే కూడా అదే నిర్ధారించిందని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో సాగునీటి విప్లవం సాధ్యమైందని సర్వే స్పష్టం చేసిందన్నారు. 2014 లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, తొమ్మిదేళ్లలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం కేసీఆర్ ప్రభుత్వ ఘనత అని ఆర్థిక సర్వే కొనియాడిందని కేటీఆర్ పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!